మూడు తరాల కథ

 
 
 "వద్దు వద్దంటే మెడ గట్టినారు
పెద్ద ఎద్దంటి పెళ్ళాన్ని
కూర్చుంటే గుంజిల్లు
లేస్తే మెడిగాల్లు
అబ్బో అది ఆలి కాదు ఎర్రతేలు "
అని మా తాత అనేవాడని మా అమ్మమ్మ చెప్పేది. పుణ్యాత్ముడు మా తాత ఏ లోకాన ఉన్నాడో గాని  మా అవ్వ ఇప్పటికి "బెత్తెడు మనిషి జానెడు బుద్ది"  అంటూ  ఆయన చమత్కారాలని తలస్తూనే ఉంది. తాత ఈ లోకానికి టాటా చేప్పెసి ఐదు దశాబ్దాలు దాటింది. అమ్మమ్మ నవదశకాన్ని పూర్థి చేసింది. అమ్మమ్మ తోటి ప్రయాణీకులందరూ కాలగతిన కలసిపోయారు. మా అవ్వని నలుగురు పిల్లల తల్లిని చేసి ఆయన బాద్యతలు తీసుకోక "డబ్బు మిథ్య"  అంటూ "కలగంటి కలగంటి నేను కమలాక్షునయనాలను కలగంటి" అంటూ జీవితాన్ని కీర్తనలతో గడిపేశాడు. ఆమె నలుగురు పిల్లలలో మా అమ్మ ఒక్కతి.  
మా మావయ్య పెళ్ళి :....................
మా అమ్మమ్మ కుటుంబంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా పెద్ద మావయ్య గురించి.  ఆయన ఒక రాబిన్ హూడ్ లా ఫీల్ అయ్యేవాడు. ఇంట్లొ ఉన్న బియ్యము పప్పులు అన్నీ ఎవరైనా వచ్చి బియ్యం నిండుకున్నాయి అంటే చాలు ఇచ్చేసేవాడు. పోని జాబ్ చేస్తాడా అంటే   చీ చీ పాడు ప్రభుత్వ ఉద్యోగాలు, కొంచం కూడా స్వేచ్చ ఉండదు, నేను వ్యవసాయం చేస్తాను అనేవాడు. ఒరే  వ్యవసాయం అన్నది ఎండా వానా చూడక రేయింపవళ్ళు  కష్టపడాలి నాయనా అని అమ్మమ్మ ఎంత మొత్తుకున్న వినేవాడు కాడు. "తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు"  అనే మొండివాడు. ఇక మా మావయ్య పెళ్ళి ఊరిలో ఒక యుద్దాన్ని రేపింది.  ఊరు మొత్తం రెండు గుంపులుగా విడిపోయ్యింది.మా పెద్ద మావయ్య టీచర్ ట్రయినింగ్ చేసేటప్పుడు తన సహవాసి ని ప్రేమించాడు. ఆమె వేరెవ్వరో కాదు మా ప్రమీల అత్తయ్యే. 

 
ప్రమీల అత్తయ్యది మా ఊరే, మా మావయ్యకు వరుసే కాని వాళ్ళ నాన్న మార్బల్ వ్యాపారం చేస్తూ కడపలో స్తిరపడి రియల్ వ్యాపారంతో బాగా కూడబెట్టాడు.   ఆ పిల్ల బంగారం. జానెడు కళ్ళు. అందాన్ని చిదిమి దీపం పెట్టుకోవచ్చునని మా ప్రమీల అత్తయ్యని కోడలుగా చేసుకొవాలని మా అమ్మమ్మ ఎంతో ఆశ పడింది. మావయ్య అమ్మమ్మని రాయబారిగా ప్రమీల అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపాడు. ఇక అప్పుడు చూడాలి మా మావయ్య "కాలు గాలిన పిల్లి"  లా అటు ఇటు తిరుగుతూ అబ్బ ఒకటే  ఆందోళన. మేమైతే అమ్మమ్మ రాక కోసం ఎదురుచూడడం మొదలుపెట్టాం. 

అమ్మమ్మ దిగులుతో ఇంటికి వచ్చింది. మనం "కూటికి పెదలమే కాని గుణానికి కాదు" ఆమెను మర్చిపో అన్నది.  నీకు మన ఊరి పదెకరాల ఆసామి పెద్దయ్య తన కూతురిని ఇస్తానంటున్నడు,  నేను మాట్లాడతా, దిగులెందుకు అని నాన్న అంటే మా మావయ్య నా "గొంతు కొయ్యకండి అని" నాకు ఇంకో సంబంధం చూడకండి,  నన్ను ఒంటరిగా ఒదిలేయ్యండి అని చక చకా పొలం వైపు వెల్లిపోయాడు. అమ్మమ్మ దిగులుతో ఒంటరిగా "ఆకాశానికి నిచ్చెన వేయటమెందుకు"  నా కొడుకేమో "మేలిమి బంగారం" వాడికి రాత లేదే అని బాదపడుతూ బోజనం కూడ చేయక మావయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అక్కడేమో ప్రమీల అత్తయ్య  వాళ్ళ నాన్న ఆమె మీద   "అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు".  "చదివేస్తే ఉన్నమతి పొయ్యింది"  దీనికి అని   "మెరిసేదంతా బంగారం కాదు"  నీకు అమెరికా సంబందాన్ని చేస్తా నేను,  అని అత్తయ్యకు ఎంతో నచ్చ చెప్పడని తరువాత మా పిన్నవ్వ ద్వారా తెలిసింది.  కాని ప్రమీల అత్తయ్య "ఉలుకు పలుకూ లేక" రాయి లాగ ఒంటరిగాకూర్చుంది. 

తన మనస్సుని తన తండ్రి ఎందుకు అర్థం చేసుకోవట్లేదని, తన తండ్రి పరువు, తన వాళ్ళ వల్ల మావయ్య పరువు పోకూడదని ఆలోచించింది. దీనికి పెళ్ళి ఒకటే మార్గమని తలచింది. ఒకసారి పెళ్ళి ఐపోతే తన మీద ఎంతో ప్రేమని పెంచుకున్న తన తండ్రిని క్షమాపణ అడిగినా అయన మనస్సు కరుగుతుందని తలచింది. మావయ్యకు ముందే చెబితే ఒప్పుకొడని ఒకరోజు ఒంటరిగా తన చదువుకు సంబందించిన విలువైన సర్టిపికట్ లని నీళ్ళకు వెళ్ళుతున్నట్లు బిందె లో దాచి ఇంటి బయట అడుగు పెట్టింది. 
            
 ఇంతకి మా మావయ్యని అత్తమ్మ కలిసిందా...........?   

అబ్బా ఎంత ఆశ.............
మా ప్రమీల అత్తయ్య, మాపెద్ద మావయ్య  ఇద్దరూ పారిపోయి పెళ్ళి చేసుకుని ఉంటారని ఊహిస్తున్నారా. మా ప్రమీల అత్తయ్య వాళ్ళ నాన్నని అదేనండి మా తాతయ్యని విలన్ అనుకొంటున్నరా. ఊరు ఊరంతా కలసి వాళ్ళని విడదీయడానికి వాళ్ళని తరుముతూ వాళ్ళని వెంబడిస్తున్నారని ఊహిస్తున్నారా ? అదేంలేదు. ఏవండి ఇదేమి సినిమా కథ కాదండి.
మా మావయ్య , అత్తయ్య జంటని పెద్దలు కలకాలం సుఖంగా వర్దిల్లమని దీవించారు. 
రెండు కుటుంబాలు కలసి వాళ్ళ పెళ్ళిని ఘనంగా చేసారు.   
    

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ